అనంతబాబును నిన్న రాత్రంతా విచారించిన పోలీసులు
- అనంతబాబును విచారించిన సర్పవరం పోలీసులు
- 30 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిన వైనం
- ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేశారనే ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నిన్న రాత్రంతా ఆయనను సర్పవరం పోలీసులు విచారించారు. అయితే, పోలీసు విచారణకు అనంతబాబు ఏమాత్రం సహకరించలేదు. పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా బుకాయించారు.
సర్పవరం పోలీసులు అనంతబాబును దాదాపు 30 ప్రశ్నలతో విచారించగా, ఆయన కేవలం ఆరింటికి మాత్రమే సమాధానం ఇచ్చారు. సాక్షులకు నగదు పంపిణీ, బెదిరింపుల అంశంపై 'నాకేమీ తెలియదు' అంటూ మౌనం వహించారు. అజ్ఞాతంలో ఉన్న సమయంలో ఆయనకు ఏలేశ్వరంలో ఒక వైసీపీ మాజీ కౌన్సిలర్, రాజమండ్రిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతబాబు తనను చంపేస్తానని బెదిరించారని సాక్షిగా ఉన్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్ట్ అనివార్యమైంది. నేడు అనంతబాబును కోర్టులో హాజరుపరచనున్నారు.